ఆన్‌లైన్‌ నుంచి ఇండియా మ్యాప్స్ కనుమరుగవుతోందా, ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు 

గూగుల్ మ్యాప్ ద్వారా అందరూ కొత్త దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రాంతాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అలాగే టూరిస్టులు రెండు మూడు రోజులు టూర్ వేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను దర్శించడానికి ఈ మ్యాప్ మీదనే ఆధారపడతారు. ఈ మ్యాప్స్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఉగ్రవాదులు ఈ మ్యాప్ సాయంతో దాడులు కొనసాగిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. దీంతో దేశ భద్రతకు పెను ముప్పు వాటిల్లిన నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ ఆన్ లైన్‌లో ఇండియా మాప్స్ అప్ లోడ్ చేయడం త్వరలో నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

సెక్యూరిటీ పరంగా దేశ భద్రతా ముప్పు కలిగించే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇండియా మ్యాప్స్.. గూగుల్ తన ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయకుండా నిరోధించేలా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో సమీక్షించాల్సిందిగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ సి.హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టనుంది. దీనిపై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది కిసాలయ శుక్లా గూగుల్ ఎర్త్‌లోని మ్యాప్స్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ప్రజలు సులభంగా చెక్ చేసుకోగలగుతున్నారని తెలిపారు. 

దేశ మ్యాప్స్ వివరాలను థర్డ్ పార్టీలకు అందించే హక్కు భారత ప్రభుత్వానికి మాత్రమే ఉందని శుక్లా వాదించారు. దేశ మ్యాప్స్ కు సంబంధించి కొత్త నేవిగేషన్ సిస్టమ్ సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని శుక్లా కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న  ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి దీనిపై తమ నిర్ణయాన్ని తెలపాలని కోరింది. 

అప్పుడు ప్రైవేటు సంస్థలు అందించే సర్వీసులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. అవసరమైతే, భారత చట్టానికి అనుగుణంగా కంపెనీకి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఇండియా మ్యాప్స్ అప్ లోడ్ చేయకుండా గూగుల్‌ను నిరోధించడం అవసరమో లేదో తేల్చాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 

పీటీఐ కథనం ప్రకారం.. 2008లో ముంబైలో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు కూడా గూగుల్ మ్యాప్ ద్వారానే సిటీలో దాడులకు పాల్పడిన విషయాన్ని శుక్లా ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం.. ఇండియా మ్యాప్స్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకుండా గూగుల్‌ను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

న్యూస్ టెక్నాలజీ గూగుల్ మ్యాప్స్ గూగుల్ గూగుల్ మ్యాప్స్ ఇండియా ఢిల్లీ హైకోర్టు